పోలీసుల తీరుపై ఆగ్రహం.. అధికారంలోకి వస్తే కేసులపై సమీక్ష చేస్తామని వ్యాఖ్య
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 22:
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై, అలాగే పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీజీ టీవీ అధినేత పూదరి సత్యనారాయణ గౌడ్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని, ప్రజలు రాజ్యాంగం తెలుసుకుని అభివృద్ధి చెందకుండా అడ్డుకునే విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి హోదాలో ఉన్న సమయంలో తనపై అనేక కేసులు నమోదు చేయించడమే కాకుండా రౌడీషీట్ కూడా తెరిపించారని విమర్శించారు.
పూదరి సత్యనారాయణ గౌడ్పై ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశారని, జూన్ 9న నమోదైన కేసు విషయంలో ముత్తారం పోలీస్ స్టేషన్ కేసు అయినప్పటికీ రామగిరి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారని అన్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండటాన్ని పోలీసులపై దాడి చేసేందుకు కూడగట్టుకున్నారని కేసు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ ఘటనలో పూదరి తల్లిపై దౌర్జన్యం జరిగిందని ఆరోపించారు.
సత్యనారాయణ గౌడ్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 42 రోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారని, దీనిపై మంత్రి పోలీసు అధికారులను దుర్భాషలాడారని ఆరోపించారు. హైకోర్టులో ఈ కేసులపై పోలీసులకు తీవ్ర వ్యాఖ్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం నమోదైన కేసులన్నింటిపై సమీక్ష నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పుట్ట మధూకర్ హెచ్చరించారు. ప్రజల కోసం పోరాడేవారికి న్యాయం తప్పకుండా దక్కుతుందని, పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ధన్వాడ పాఠశాల వంటి అభివృద్ధి పనులు కూడా పూర్తిచేయలేదని ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, నియోజకవర్గ ప్రజలు వాస్తవాలను గమనించాలని పిలుపునిచ్చారు.